Hyper Aadi: పిఠాపురంలో మేం ఏ ఇంటికి వెళ్లినా పవన్ కల్యాణ్ కే మా ఓటు అంటున్నారు: హైపర్ ఆది

  • స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన జనసేన
  • పిఠాపురం చేరుకున్న హైపర్ ఆది
  • పిఠాపురంలో పవన్ కు అపూర్వ స్పందన వస్తోందని వెల్లడి
  • పవన్ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా
Hyper Aadi talks about Pawan Kalyan chances in Pithapuram

జనసేన పార్టీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా నాగబాబు, పృథ్వీ, అంబటి రాయుడు, హైపర్ ఆది, జానీ మాస్టర్, గెటప్ శ్రీను, మొగలిరేకులు సాగర్ లను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైపర్ ఆది నేడు పిఠాపురం చేరుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు అయిపోయే వరకు ఇక్కడే ఉంటామని, జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని వెల్లడించారు. షూటింగులన్నీ ముందే పూర్తి చేసుకుని వచ్చామని తెలిపారు. 

పిఠాపురంలో ఇప్పటికే పవన్ కల్యాణ్ కోసం నాగబాబు ప్రచారం చేస్తున్నారని, ఇవాళ ఆయనతో పాటు తాము కూడా ప్రచారంలో పాల్గొంటున్నామని హైపర్ ఆది వెల్లడించారు. 

తాము ఏ ఇంటికి వెళ్లినా అపూర్వ స్పందన వస్తోందని, తాము అడగకముందే, పవన్ కల్యాణ్ కే ఓటేస్తామని వారే చెబుతున్నారని వివరించారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు లక్షకు పైగా మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారని హైపర్ ఆది స్పష్టం చేశారు.

More Telugu News