Mudragada Padmanabham: పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయం... ముద్రగడ తన పేరును ఇప్పుడే మార్చుకోవాలి: జనసేన నేత శివశంకర్

  • పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యమని ప్రకటించిన ముద్రగడ
  • లేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని వెల్లడి
  • పవన్ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదన్న శివశంకర్
  • ముద్రగడ పిచ్చికూతలు మానుకోకపోతే తగిన సమాధానమిస్తామని హెచ్చరిక
T Sivashankar fires on Mudragada Padmanabham

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే తన లక్ష్యం అంటూ ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కల్యాణ్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. 

వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే ముద్రగడ మచ్చలేని నాయకుడు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని శివశంకర్ ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేయాలో చెప్పడానికి ఆయనెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాపు ఉద్యమ నేతగా చెప్పుకుంటున్న ముద్రగడ ఇప్పటివరకు కాపుల అభ్యున్నతికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కాపుల రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కావని తెగేసి చెప్పిన సీఎం జగన్ పంచన చేరిన ముద్రగడ... కాపులకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కాపు ఉద్యమనేతనంటూ సీఎంకు ఊడిగం చేయడాన్ని కాపులందరూ ఛీత్కరించుకుంటున్నారని శివశంకర్ నిప్పులు చెరిగారు. 

"పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదు. ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డి అని ఇప్పుడే మార్చుకుంటే బాగుంటుంది. నిరాదరణకు గురైన రెల్లి కులాన్ని పవన్ అక్కునచేర్చుకున్నారు. ఆయన అన్ని కులాలను సమానంగా చూస్తారు. కానీ, కాపు ఉద్యమాన్ని తన రాజకీయ పునరావాస కేంద్రంగా  మార్చుకున్న ఘనుడు ముద్రగడ... ఈ విషయం అందరికీ తెలుసు. 

నల్లా సూర్యచంద్రరావు, ఎస్ జీ రామారావు, నిమ్మకాయల వీరరాఘవనాయుడు వంటి కాపు నేతలు చేపట్టిన కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని హైజాక్ చేసిన మేధావి ముద్రగడ. తునిలో కాపు గర్జన సందర్భంగా కాపుల్లో ఉద్రేకాలు రెచ్చగొట్టి కొందరు కాపు యువకులు కేసుల్లో ఇరుక్కునేలా చేశారు. జీవో నెం.30 ద్వారా 13 కులాలకు రిజర్వేషన్లు దక్కితే... ముద్రగడ అసమర్థత కారణంగా కాపులకు తీవ్ర అన్యాయం జరిగింది. 

పవన్ కల్యాణ్ తన ఇంటికి వచ్చి పిలిస్తే జనసేన పార్టీలో చేరతానని చెప్పిన ముద్రగడ... జగన్ ఇంటికి వచ్చి ఆహ్వానించకపోయినా వెళ్లి వైసీపీలో చేరారు. పవన్ ఎదుగుదల చూసి ఓర్వలేక ముద్రగడ పిచ్చికూతలు కూస్తున్నారు. అవాకులు చెవాకులు పేలడం మానుకోకపోతే ముద్రగడకు తగిన రీతిలో సమాధానమిస్తాం" అంటూ శివశంకర్ ఘాటుగా హెచ్చరించారు.

More Telugu News