Yanamala: మేనిఫెస్టో అమలుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు... ఇలా చేస్తే సాధ్యమే: యనమల రామకృష్ణుడు

  • ప్రజా ఆమోదయోగ్యంగా కూటమి మేనిఫెస్టో ఉందన్న యనమల
  • కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని వెల్లడి
  • పరిశ్రమలు, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ లను అభివృద్ధి చేస్తామని వివరణ 
  • యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాని హామీ 
  • రాష్ట్రంలో ఆదాయాన్ని సృష్టించి మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తామని స్పష్టీకరణ
Yanamala talks about manifesto

కూటమి మేనిఫెస్టో  అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని ప్రజలే చెబుతున్నారని, కూటమి మేనిఫెస్టోపై వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ మెచ్చుకున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేనిఫెస్టోతో ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. 

ఇవాళ ఆయన మీడియా( జూమ్ మీటింగ్) సమావేశంలో మాట్లాడుతూ....జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, ఈ వినాశనం నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ప్రజా మేనిఫెస్టోను రూపొందించామని స్పష్టం చేశారు. ఈ మేనిఫెస్టోతో అన్ని  వర్గాలకు మేలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

సందేహాలు నివృత్తి చేయడం కూటమి బాధ్యత

ఇప్పటికే రూ. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ మేనిఫెస్టోను ఎలా అమలు చేస్తారన్న అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాన్ని నివృత్తి చేయడం కూటమి బాధ్యత. ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి చాలా ఆదాయం చేకూరుతుంది. ఉన్న వనరులను వినియోగించుకుని ప్రైవేట్ పరం అవుతున్న ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది. 

దీంట్లో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. మైన్స్ ను దుర్వినియోగం చేశారు. మద్యంలో అక్రమాలకు పాల్పడ్డారు. పక్కదారి పడుతున్న సొమ్ములను ప్రభుత్వానికి మళ్లీస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.

ఇంతమంది సలహాదారులు అవసరమా?

డీబీటీ ఇస్తున్నామని చెబుతూ వైసీపీ ప్రభుత్వం అనవసర ఖర్చులను పెట్టింది. ఉదాహరణకు... అక్కర్లేని సలహాదారులు ఎంతోమంది ఉన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే ఇలాంటి వృథా ఖర్చులను తగ్గించి ఇలాంటి సలహాదారులను తొలగిస్తాం. రెవెన్యూ నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. దాన్ని దారిలోకి తీసుకు వస్తాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా పెద్దగా లేదు. ట్యాక్స్ జీఎస్డీపీ నిష్పత్తిలో ఏపీ ప్రభుత్వం చాలా కింది స్థాయిలో ఉంది. 

కూటమి అధికారంలోకి రాగానే ట్యాక్స్ లు పెంచకుండా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకునేలా చర్యలు తీసుకుంటాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవడానికి ఉన్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటే ఆదాయం పెరుగుతుంది. 

ఒక్క శాతం తగ్గడంతో అంత కోత పడింది

రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో మనకు 14వ ఆర్థిక సంఘం 2% పెంచితే... రాష్ట్రాలకు ఇచ్చే ఆదాయాన్ని 15వ ఆర్థిక సంఘం గత సంవత్సరం 41% నుంచి 40% కి తగ్గించింది. 1% శాతం తగ్గటంతో రాష్ట్రానికి రూ. 1500 కోట్లు కేంద్ర నిధుల్లో కోత పడింది. నేడు కేంద్రం మనకు సపోర్టు చేస్తుంది. 16వ ఆర్థిక సంఘంతో చర్చించి ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ ను 50 శాతం పెంచేలా కృషి చేస్తే రాష్ట్ర ఆదాయం  పెరుగుతుంది.

అభివృద్ధి ఉంటే ఆదాయం సృష్టి జరుగుతుంది

టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక అభివృద్ధి రేటు డబుల్ డిజిట్ లో ఉంటే... వైసీపీ దాన్ని సింగిల్ డిజిట్ కు తెచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ డబుల్ డిజిట్ కు జీఎస్డీపీని తీసుకు వస్తాం. 

అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం యావరేజ్ గా రూ.12 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అందులో మళ్లీ జీతాలు కూడా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి దూరం అయ్యింది. కనీసం రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోయారు. అభివృద్ధి ఉంటే అక్కడ ఆదాయం సృష్టి జరుగుతుంది. దాంతో రాష్ట్రంలో ఆదాయం పెరిగి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.

సంపద పెరిగే విధంగా అన్ని రంగాలపై దృష్టి సారిస్తాం

టీడీపీ మేని ఫెస్టోతో బలహీన వార్గాలకు ఎంతో మేలు జరుగుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి. అధిక ధరలు నియంత్రణలోకి వస్తాయి. అనవసరమైన ఖర్చులు అదుపులోకి వస్తాయి. చిరు వ్యాపారులకు, మహిళకు మేలు జరుగుతుంది. పనుల కల్పనతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రూరల్ ఎకానమీ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకం. 

కోఆపరేటివ్ సిస్టమ్ ను డెవలప్ చేయాల్సి ఉంది. ఆగ్రోప్రొసెస్ ఇండస్ట్రీస్, హార్టీకల్చర్, ఆక్వాకల్చర్, లైవ్ స్టాక్ లు అన్నీ కూడా రాష్ట్ర గ్రోత్ ను పెంచేవి. ఇప్పుడు ఇవి అన్ని కూడా పడిపోయాయి. వీటిని గాడిలో పెడితే రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది. సంపద పెరిగే విధంగా అన్ని సెక్టార్ లపై దృష్టి పెడతాం.

పారిశ్రామికాభివృద్ధి రివర్స్ అయింది

ఈ ఐదు సంవత్సరాల్లో పారిశ్రామికాభివృద్ధి తిరోగమనంలోకి పడిపోయింది. ఉన్న పరిశ్రమలు పారిపోయాయి. జగన్ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ రాలేదు. దాన్ని మళ్లీ సరిదిద్దాల్సి ఉంది. కొత్త పరిశ్రమలను తీసుకు రావాలి. పరిశ్రమలు వస్తే  ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు  వస్తే ఆదాయం పెరుగుతుంది. 

పేదలు, యువతను దృష్టిలో పెట్టుకుని కూటమి మేనిఫెస్టోను  రూపొందించాం. 100 శాతం హామీలను అమలు చేయగలిగే మేని ఫెస్టో ఇది. ఎటువంటి సందేహాలు అక్కరలేదు. 

వైసీపీ పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యింది. వైసీపీ పాలనలో పేదలకు ఆరోగ్యం అందని పరిస్థితి నెలకొంది. పేదల ఆరోగ్య రక్షణకు కూటమి కట్టుబడి ఉంది. ఓవరాల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువస్తాం. ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ లను ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటాం.

ఆటోమేటిక్ గా సర్వీస్ సెక్టార్ కూడా బాగుపడుతుంది


ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ సెక్టార్ లు బాగుపడితే... ఆటోమేటిక్ గా సర్వీస్ సెక్టార్ బాగుపడుతుంది. సర్వీస్ సెక్టార్ ను  వైసీపీ నాశనం చేసింది. టూరిజం, ఐటీలను పట్టించుకోలేదు. రాష్ట్రానికి ఆదాయం పెంచాలన్న ఆలోచన చేయలేదు. వాళ్ల సొంత ఆదాయం పెంచుకోవడంపైనే శ్రద్ధపెట్టారు. 

సంక్షేమంతో పాటు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి మేనిఫెస్టోను తయారు చేశారు. కూటమి మేనిఫెస్టోతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది.

More Telugu News