నువ్వేం మంత్రివయ్యా... క్యూసెక్కు అంటే తెలుసా? టీఎంసీ అంటే తెలుసా?: సత్తెనపల్లిలో మంత్రి అంబటిపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు

Chandrababu questions Ambati Rambabu
టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జంగా కృష్ణమూర్తి వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు అని, యాదవ కులానికి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీగా పదవీకాలం ఉన్నప్పటికీ, రాష్ట్రం నాశనం అవుతుంటే చూసి తట్టుకోలేక పదవిని కూడా వదులుకుని బయటికి వచ్చేశాడని వివరించారు. పదవులు, బంధుత్వాలు, డబ్బు ముఖ్యం కాదని, రాష్ట్రం తగలబడుతుంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఇక, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గురించి ప్రస్తావిస్తూ, అమరావతిని నాశనం చేస్తుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చేశాడని వివరించారు. అతడు టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా... అతడిపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. 

అదే సమయంలో, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ రాజకీయనాయకుడు అని, తనపై అభిమానంతో టీడీపీలోకి వచ్చారని వెల్లడించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే టీడీపీతోనే సాధ్యమని నమ్మి, ఆయన పార్టీలోకి వచ్చారు... కన్నాను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. సత్తెనపల్లికి ఒక సమర్థుడైన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అని కొనియాడారు. 

యువకుడు, ఉత్సాహవంతుడైన లావు శ్రీకృష్ణదేవరాయలును ఎంపీగా, అనుభవశాలి కన్నా లక్ష్మీనారాయణను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సత్తెనపల్లికి నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలన్నా నాది బాధ్యత అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. 

సత్తెనపల్లి అంటే గుర్తుకొచ్చేది కోడెల

ఇవాళ సత్తెనపల్లి వచ్చాను. ఈ సందర్భంగా నా మిత్రుడు కోడెల శివప్రసాద్ ను గుర్తుచేసుకోవాలి. ఒక పల్నాటి పులి, రాజకీయ దురంధరుడు. రాజకీయ కార్యదక్షత కలిగిన వ్యక్తి. ఏ పని అప్పచెప్పినా సమర్థంగా నిర్వహించగలిగిన వ్యక్తి. నాడు ఎన్టీఆర్ ఆయనకు బసవతారకం ఆసుపత్రిని అప్పగిస్తే, అద్భుతంగా నిర్వహించాడు. ఇక్కడే తారకరామ సాగర్ ను నేనే వచ్చి ప్రారంభించాను. ఆ సరస్సులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి, పక్కనే వావిలాల గోపాలకృష్ణయ్య స్మారక చిహ్నం కూడా తయారుచేశాం. అవన్నీ నా జీవితంలో మర్చిపోలేను. 

కానీ ఇవాళ ఒక సైకో పల్నాటి టైగర్ ను కూడా ఎలా వేధించి, వేధించి... చివరికి ఎలా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో మీరు గమనించాలి. ఇవాళ కోడెల లేకపోవడం బాధాకరం. ఆయనతో ప్రారంభమైన ఆత్మహత్యలు, హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయి. మనం బతకాలంటే, ఈ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే సైకో పోవాలి. కోడెల కుటుంబానికి మేం అండగా ఉంటాం. పార్టీ కోసం పనిచేయాలని కోడెల శివరాంను కూడా పిలిచాం. ఇవాళ శివరాం కూడా వచ్చాడు. 

ఏమి రాంబాబు... రంకెల రాంబాబా.... ఆంబోతు రాంబాబా...?

ఇక్కడో మంత్రి ఉన్నాడు... ఉన్నాడు కదా! ఏమి రాంబాబు...? రంకెల రాంబాబా... ఆంబోతు రాంబాబా...? మంత్రి అంటే ఏంటో అతడికి అర్థం తెలుసా? నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశాడా? ఒక్క సిమెంట్ రోడ్డు వేశాడా? ఒక్క రోడ్డు అయినా మరమ్మతు చేశాడా? 

నువ్వు ఇరిగేషన్ మంత్రివి కదా... రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయో తెలుసా నీకు? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా నీకు? క్యూసెక్కు అంటే తెలుసా నీకు? టీఎంసీ అంటే తెలుసా నీకు? తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావా నువ్వు?... నువ్వేం మంత్రివయ్యా! కనీసం సత్తెనపల్లిలో కాలువల్లో పూడికలు తీయించావా? ఆయన మీద నాకు ద్వేషం లేదు, బాధ లేదు. పోలవరం వెళ్లి కనీసం సబ్జెక్టు నేర్చుకుని ఉంటే సంతోషించేవాడ్ని. ఆయన అక్కడ చేయగలిగిందేమీ లేదు. 

ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది పవన్ కల్యాణ్ ను, నన్ను తిట్టడానికి. నువ్వు చేసిన పనులకు ప్రజలే సమాధానం చెప్పే రోజు వస్తుంది. మేం సమర్థత చూసి మంత్రి పదవి ఇస్తాం... కానీ ఇతడు సంక్రాంతి సంబరాల్లో డ్యాన్సులేస్తాడు. పోలవరం సాధించి నువ్వు డ్యాన్స్ చేస్తే అందరూ చప్పట్లు కొట్టేవాళ్లు. 

సంక్రాంతి సంబరాల పేరుతో పింఛనుదారుల నుంచి రూ.250 చొప్పున రూ.10 లక్షలు వసూలు చేసుకున్నాడు! డ్రెయినేజిలో ఒక బీసీ యువకుడు చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇచ్చారు... కానీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ వాటా అడిగిన మంత్రా, మజాకా?... అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.
Go Back to Shorts
Chandrababu
Ambati Rambabu
Sattenapalle
Praja Galam
TDP
YSRCP

More Telugu News