మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై కారు బీభత్సం... ఇద్దరి దుర్మరణం

  • గత అర్ధరాత్రి దాటాక ఘటన
  • కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్న బావ, బావమరిది 
  • మృత్యువు రూపంలో వేగంగా దూసుకొచ్చిన కారు
  • మృతులను యూసఫ్ గూడకు చెందిన అనిల్, అజయ్ గా గుర్తింపు
హైదరాబాద్ లో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై గత అర్ధరాత్రి తర్వాత ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఇద్దరిని ఢీకొనగా, ఆ ఇద్దరూ మరణించారు. వారు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా, కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి జీవితాలను ఛిదిమేసింది. వారిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 

మృతులను యూసఫ్ గూడకు చెందిన  అనిల్, అజయ్ గా గుర్తించారు. వారు బావ, బావమరిది అని తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

కాగా, ప్రమాదానికి కారణమైన కారు... ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టిన ఆనంతరం ఆగకుండా వెళ్లిపోవడంతో, కారు నెంబరు (AP28DV7999) ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజి పరిశీలించాలని పోలీసులు నిర్ణయించారు.

Hit and Run
Road Accident
Madhapur Cable Bridge
Hyderabad
Telangana

More Telugu News