విమానం లేటైతే ప్రయాణికులు అందులోనే కూర్చోవాల్సిన పనిలేదు.. బీసీఏఎస్ కొత్త మార్గదర్శకాలు

ప్రయాణికులు విమానంలో ఎక్కి కూర్చున్నాక బయలుదేరడం ఆలస్యమైతే కొన్ని నిమిషాల నుంచి కొన్నిసార్లు గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి వస్తుంటుంది. ఒకసారి లోపలికి వెళ్లాక బయలుదేరే వరకు అందులోనే మగ్గిపోవాల్సి వస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏవియేషన్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నూతన మార్గదర్శకాలు జారీచేసింది.

విమానం బయలుదేరడం ఆలస్యమైతే అందులోనే కూర్చుని ఉండాల్సిన పనిలేదని, విమానాశ్రయ డిపార్చర్ గేటు నుంచి బయటకు రావొచ్చని పేర్కొంటూ బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ ఉత్తర్వులు జారీచేశారు. బీసీఏఎస్ తాజా నిర్ణయంతో ప్రయాణికులకు బోల్డంత శ్రమ తప్పినట్టు అయింది. విమానం ఎక్కిన తర్వాత టేకాఫ్ ఆలస్యమైనా, అత్యవసర పని ఉన్నా ప్రయాణికుడు డిపార్టర్ గేటు ద్వారా బయటకు వచ్చేందుకు తాజా మార్గదర్శకాలు అనుమతిస్తాయి. మార్గదర్శకాల అమలుకు స్క్రీనింగ్ సహా మౌలిక సదుపాయాల కోసం విమానాశ్రయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రయాణికుల డీబోర్డ్‌పై సంబంధిత విమానయాన సంస్థలు, భద్రతా ఏజెన్సీలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది.


More Telugu News