Rahul Gandhi: కేంద్రంలో ప్రభుత్వం మారాక వారిపై చర్యలు.. ఇది నా గ్యారంటీ: రాహుల్ గాంధీ

Rahul Gandhi Reaction On Second IT Notices To Party
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీపైనా, పార్టీ నేతలపైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులను గుర్తుంచుకుంటామని, కేంద్రంలో ప్రభుత్వం మారిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరోసారి నోటీసులు పంపడం, రూ.1,800 కోట్లు కట్టాలని ఆదేశించడంపై ఆయన మండిపడ్డారు. ఈ నోటీసులపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఉద్దేశపూర్వకంగా, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల మెప్పుకోసం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న అధికారులపై మా ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోసారి ఏ అధికారి కూడా ఇలాంటి పనులు చేయకుండా, చేయాలనే ఆలోచన కూడా రానివ్వని రీతిలో చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ తీవ్రంగా హెచ్చరించారు. ఆ అధికారులకు ఇదీ నా గ్యారెంటీ అని పేర్కొన్నారు. బీజేపీ ఎల్లకాలం అధికారంలో ఉండదని, ఏదో ఒక రోజు ఆ పార్టీ అధికారానికి దూరమవుతుందనే విషయం అధికారులు గుర్తుంచుకోవాలని చెప్పారు. అప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు.

ఇప్పటికే రూ.200 కోట్ల పన్ను చెల్లించాలంటూ కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు పంపింది. ఈ వ్యవహారంలోనే కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. తాజాగా మరోసారి రూ.1,800 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసులు పంపింది. 2017-18, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ మొత్తం బకాయి ఉందంటూ పేర్కొంది. ఈ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి జైరాం రమేశ్, సీనియర్ లీడర్ అజయ్ మాకెన్ తీవ్రంగా మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ‘ట్యాక్స్ టెర్రరిజ’మే అని జైరాం రమేశ్ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ట్యాక్స్ టెర్రరిజం ఆపేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కూడా రూ.4,617.58 కోట్లు బకాయిపడ్డదని, ఆ మొత్తాన్ని వసూలు చేయాలని సవాల్ విసిరారు.
Go Back to Shorts
Rahul Gandhi
IT Notice
Congress Party
1800 Crores
Officials

More Telugu News