Chandrababu: ప్రభాకర్ రెడ్డిపై ఎవరిని పోటీకి దింపారో చూశారా?: చంద్రబాబు

  • నెల్లూరు జిల్లా కావలిలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నా, ప్రభాకర్ రెడ్డి ఎప్పుడో గెలిచాడన్న చంద్రబాబు
  • ప్రభాకర్ రెడ్డిపై ఏ2ను బరిలో దింపారని ఎద్దేవా
  • ఏ2 సభలు జనం లేక వెలవెలపోతున్నాయని వెల్లడి
  • సభ నుంచి జనం వెళ్లిపోతుంటే భోజనాలు పెడతాం అని బతిమాలుకున్నారని వ్యంగ్యం
Chandrababu satires on Vijayasaireddy in Kavali Praja Galam rally

టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఈ సభలో నెల్లూరు పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా, నెల్లూరు ఎంపీ స్థానం వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండడంపై చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నప్పటికీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడో గెలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. 

"ప్రభాకర్ రెడ్డిపై ఎవరిని పోటీకి దింపారో చూశారా... ఏ2, ఒక అవినీతిపరుడు, ఒక పనికిమాలిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం వంటి వ్యక్తి. నిన్న చూశాం... మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు. అయ్యా వెళ్లిపోకండి... భోజనం పెడతాం తినండి...బాబ్బాబూ ఉండండి అని బతిమాలుకుంటున్నాడు... కానీ, నువ్వు వద్దు, నీ ఉపనాస్యం వద్దు అని జనాలు పారిపోయే పరిస్థితికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డీ... నీ ఎంపీ విశ్వసనీయత అదీ! 

ఇవాళ కావలి సభకు వచ్చిన జనాలను చూశావా... మా ఎంపీ విశ్వసనీయత ఇదీ! నిన్ను ఓడించడానికి మండుటెండలను కూడా లెక్కచేయకుండా మేము సిద్ధం అంటూ ముందుకొచ్చారు.

ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అర్ధాంగి ప్రశాంతి రెడ్డి కోవూరులో పోటీ చేస్తున్నారు. ఆ కుటుంబానికి ఒకటే ఆలోచన... రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు దగ్గర అవ్వాలని వారు భావించారు. కానీ, ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఆ ఆడబిడ్డ ముందుకొచ్చి స్వయంగా ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 

ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే వారిని ఇష్టానుసారం బూతులు తిట్టడం, దుష్ప్రచారం చేస్తూ ఉన్మాదుల్లా తయారయ్యారు. మొన్నటివరకు మీరు ఒకాయనను చూశారు. బుల్లెట్ దించుతాం అంటుండేవాడు. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగింది. ఒక తన్ను తంతే వెళ్లి నరసరావుపేటలో పడ్డాడు. రేపో, ఎల్లుండో అక్కడి ఓటర్లు కూడా ఒక తన్ను తంతే చెన్నైలో వెళ్లి పడతాడు" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.

More Telugu News