Sri Bharath: రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పడింది: శ్రీభరత్

  • విశాఖ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
  • ఒక ఉన్నతాశయంతో ఎన్నికలకు వెళ్తున్నామన్న భరత్
  • చంద్రబాబును మళ్లీ సీఎం చేసుకుందామన్న గండి బాబ్జీ
TDP formation day celebrations in Vizag

జనసేన, బీజేపీ పార్టీలతో కలిసి ఒక ఉన్నతాశయంతో ఎన్నికలకు వెళ్తున్నామని విశాఖ లోక్ సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ఏర్పడిందనే విషయం అందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు. ఏదైనా కారణం వల్ల పార్టీకి దూరమైన వాళ్లు మళ్లీ పార్టీలో చేరాలనుకుంటే వారిని ఆహ్వానిస్తామని తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ, పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పారు. నిబద్ధతకు, క్రమశిక్షణకు పెట్టింది పేరైన టీడీపీలో మనమంతా ఉండటం మనకు గర్వకారణమని అన్నారు. ఏపీలో దుర్మార్గపు పాలనను తరిమికొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు.

More Telugu News