శ్రీరామ నవమి రోజున భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని కనులారా వీక్షించాలనుకుంటున్నారా?.. బుక్ చేసుకోండిలా!

Bhadradri Ramaiah Temple Released Online Ticket For Kalyanam
  • ఏప్రిల్ 17న శ్రీరామ నవమి
  • సెక్టార్ టికెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన దేవస్థానం
  • ఏప్రిల్ 1 నుంచి నేరుగానూ కొనుగోలు చేసుకోవచ్చు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్ 17న శ్రీరామ నవమిని పురస్కరించుకుని కల్యాణం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాములోరి కల్యాణాన్ని కనులారా వీక్షించాలనుకునే భక్తుల కోసం నేటి నుంచి సెక్టార్ టికెట్లను దేవస్థానం అందుబాటులోకి ఉంచింది. శ్రీరామ నవమి రోజున ఉభయ దాతల టికెట్ రుసుమును రూ. 7,500గా పేర్కొంది. ఈ టికెట్ ద్వారా ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. అలాగే, రూ. 2500, రూ. 2000, రూ. 1000, రూ. 300, రూ. 150 టికెట్లను కూడా అందుబాటులో ఉంచింది. ఈ టికెట్లపై ఒక్కరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. 18న పట్టాభిషేకం కోసం రూ. 1500, రూ. 500, రూ.100 టికెట్లను ప్రకటించింది. వీటిని https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. కల్యాణం రోజున రావడం వీలుకాని భక్తులు రూ. 5 వేలు, రూ. 116 టికెట్లతో పరోక్ష పద్ధతిలో గోత్రనామాలతో పూజ చేయించుకోవచ్చు. ఈ టికెట్లు కూడా వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి 17 వరకు ఉదయం ఆరు గంటల నుంచి రామాలయ కార్యాలయం (తానీషా కల్యాణ మండపం)లో ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా టికెట్లు కొనుగోలు చేయాలనుకున్న వారు ఏప్రిల్ 1 నుంచి భద్రాచలం రామాలయం, తానీషా కల్యాణ మండపం, గోదావరి బ్రిడ్జ్ సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో నేరుగా విక్రయించనున్నారు.
Go Back to Shorts
Bhadradri Ramaiah
Sri Rama Navami
Bhadradri Kothagudem District
Kalyanam Tickets

More Telugu News