YS Sharmila: ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపీ, వైసీపీ, బీజేపీ వారికి సిగ్గుండాలి: విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై షర్మిల విమర్శలు

Sharmila comments on Visakha drugs issue
షార్ట్స్‌లో చూడండి
బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ లో విశాఖ పోర్టుకు చేరిన 25 వేల కిలోల డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్ వెనుక ఉన్నది మీరంటే మీరని టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 

విశాఖలో చిక్కిన డ్రగ్స్ పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. నిఘా వ్యవస్థకు తెలియకుండా వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వస్తాయని ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? అని షర్మిల నిలదీశారు. 

విశాఖ డ్రగ్స్ ఘటనలో నిజం నిగ్గు తేల్చాలని సీబీఐని కోరుతున్నామని, సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నం పెట్టే అన్నపూర్ణ అని, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశానికి డ్రగ్స్ రాజధానిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఏది కావాలన్నా ఏపీనే చిరునామాగా మారిందని పేర్కొన్నారు. 

దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని అన్నారు. డ్రగ్స్ రవాణా, వినియోగంలో ఏపీకి నెంబర్ వన్ ముద్ర వేశారని షర్మిల విచారం వ్యక్తం చేశారు.

"మొదటి ఐదేళ్లు టీడీపీ, ఆ తర్వాత ఐదేళ్లు వైసీపీ... ఈ పదేళ్లలో ఏపీని డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. 25 వేల కిలోల మాదకద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే... మా తప్పేమీ లేదంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపీ, వైసీపీ, బీజేపీ వారికి సిగ్గుండాలి. కేంద్ర, రాష్ట్ర నిఘా వ్యవస్థల సపోర్ట్ లేకుండా వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా తీరానికి చేరతాయి? ఇది ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా పరిగణిస్తున్నాం" అని షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు.
Go Back to Shorts
YS Sharmila
Visakha Drugs Case
Congress
YSRCP
TDP

More Telugu News