Revanth Reddy: పదో తరగతి పరీక్షలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహించాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత ఏడాది జరిగిన పలు ఘటనల నేపథ్యంలో ఈసారి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పరీక్ష కేంద్రాల వద్ద నో సెల్ ఫోన్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష పూర్తయ్యేంత వరకు అవసరమైతే జామర్లు ఏర్పాటు చేసి, ఫోన్ సిగ్నల్స్ ఆఫ్ చేయించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇన్విజిలేటర్లు, స్క్వాడ్, సిబ్బంది, విద్యార్థులు ఎవరికీ ఫోన్లు అందుబాటులో లేకుండా చూడనున్నారు. పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్నాపత్రాలు బయటకు వెళ్లకుండా, మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.