కారులో గోవాకు బయలుదేరిన యువకులు.. ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. ఒకరి మృతి

  • ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టిన టిప్పర్
  • స్పాట్ లోనే చనిపోయిన యువకుడు, మరొకరికి గాయాలు
  • టిప్పర్ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం
స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు బయలుదేరిన యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గోవాలో సరదాగా గడిపి వద్దామని బయలుదేరి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆదివారం ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బోరబండకు చెందిన అనిల్ మరో నలుగురు స్నేహితులతో కలిసి గోవా టూర్ కు కారులో బయలుదేరాడు. ఓఆర్ఆర్ మీదుగా వెళుతూ హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 వద్ద కారును పక్కకు ఆపారు. ఇంతలోనే ఓ టిప్పర్ వేగంగా దూసుకొచ్చి వారి కారును ఢీ కొట్టింది. దీంతో కారు ముందు బాగం నుజ్జునుజ్జు కాగా.. కారులో కూర్చున్న అనిల్ తో పాటు మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావంతో అనిల్ స్పాట్ లోనే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

ORR Accident
Goa Tour
Borabanda Youth
Spot Dead
Road Accident
Tipper

More Telugu News