Harish Rao: ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు: హరీశ్ రావు

  • ప్రధాని మోదీని బడే భాయ్ అంటూ రేవంత్ ఆశీర్వాదం కోరాడని గుర్తు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • కాంగ్రెస్ పాలన అంటేనే దగా అన్నట్లుగా ఉందని విమర్శ
  • కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు కూడా లేవని వ్యాఖ్య
Harish rao says congress will not win lok sabha election

ప్రధాని మోదీని బడే భాయ్ అని, ఎప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని, తద్వారా ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని చెప్పకనే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ... కేసీఆర్ పాల‌న‌లో ఏ రోజూ క‌రెంట్ పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో క‌రెంట్ కోత‌లు మొదలయ్యాయని విమర్శించారు. ఈ మాత్రం కరెంట్ కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందువల్లే వస్తోందన్నారు. దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని... ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు... ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే పోయేది లేదన్నారు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్ పోరాటంతోనే సాధ్యమవుతుందన్నారు. రుణమాఫీ, రైతుబంధు, కరెంట్, బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చురక పెట్టాలన్నారు. కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో 13 హామీలు అన్నారని... డిసెంబ‌ర్ 9వ తేదీన‌ రుణమాఫీ అన్నారని... ఎన్ని 9వ తేదీలు మారినా రుణమాఫీ మాత్రం కావడం లేదన్నారు. బోనస్ విషయంలో దగా... రుణమాఫీ విషయంలో దగా... ఉచిత కరెంట్ విషయంలో దగా... రైతు బంధు విషయంలోనూ దగా... మొత్తానికి కాంగ్రెస్ పాలన అంటేనే దగా అన్నట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ చేసిన దగాలు 420 ఉన్నాయని విమర్శించారు.

బాండ్ పేపర్ ఇచ్చి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే... ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అవుతాయన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు కూడా లేవన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌ను పార్టీ తరఫున రెండుసార్లు గెలిపిస్తే మోసం చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలన్నారు.

More Telugu News