Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఒక మాఫియాను తయారుచేసుకుని బీసీ డిక్లరేషన్ అంటున్నారు: సజ్జల

  • నేడు జయహో బీసీ సభ నిర్వహిస్తున్న టీడీపీ-జనసేన
  • బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం చంద్రబాబు ఏంచేశాడన్న సజ్జల 
Sajjala comments on BC Declaration by TDP and Janasena

టీడీపీ-జనసేన ఇవాళ జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం ఏం చేశాడని చంద్రబాబు ఇవాళ బీసీ జపం చేస్తున్నాడు అని విమర్శించారు. చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. 

చంద్రబాబు ఒక మాఫియాను తయారుచేసి బీసీ డిక్లరేషన్ అంటున్నాడని సజ్జల వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వడ్డెర ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 

"బీసీ డిక్లరేషన్ అంటున్న చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో చెప్పగలరా? జన్మభూమి కమిటీల పేరుతో ఒక ముఠాను తయారు చేశారు. ఆఖరికి మరుగుదొడ్ల అంశంలో అక్రమాలకు పాల్పడ్డారు. అన్నింటికి మంచి రాజధాని పేరుతో భారీ కుంభకోణం చేశారు. ఇక చాలు అంటూ ప్రజలు 2019లో చంద్రబాబును సాగనంపారు. నాడు 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నప్పటికీ జగన్ నిబ్బరంగా నిలబడ్డారు. బీసీలకు ఏం చేశామో మేం చెప్పుకోగలం. వెనుకబడిన వర్గాలకు సీఎం జగన్ 70 శాతం పదవులు ఇచ్చారు. జగన్ లో ఉన్న నిబద్ధత మరెవరిలోనూ కనిపించదు" అని సజ్జల వివరించారు.

More Telugu News