మేడిగడ్డ బ్యారేజీలో చిన్న సమస్యను పెద్దది చేసి చూపిస్తున్నారు: కేటీఆర్

KTR lashes out at congress over medigadda barriage issue
  • మేడిగడ్డ కుంగుబాటుపై నిపుణులతో కమిటీ వేయాలని సూచన
  • వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్
  • చిన్న సమస్యను భూతద్దంలో చూపించి కాళేశ్వరం ప్రాజెక్టే అనవసరంగా కట్టారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
  • కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయన్న కేటీఆర్
  • నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజీలు వచ్చినప్పటికీ తాము వాటిని రాజకీయం చేయలేదన్న కేటీఆర్
మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పడిన చిన్న సమస్యను చాలా పెద్దది చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ ఎస్ నేతలు 'ఛలో మేడిగడ్డ' చేపట్టిన విషయం తెలిసిందే. ఈ బ్యారేజీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నిపుణులు, మీడియా పరిశీలించింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... మేడిగడ్డ కుంగుబాటుపై నిపుణులతో కమిటీ వేయాలన్నారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిన్న సమస్యను భూతద్దంలో చూపించి కాళేశ్వరం ప్రాజెక్టే అనవసరంగా కట్టారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యాయని చెప్పడం విడ్డూరమన్నారు. బీఆర్ఎస్‌పై ఉన్న పగను రైతులు, రాష్ట్రంపై చూపవద్దని ఆయన సూచించారు. 1.6 కిలో మీటర్ల మేర ఉన్న ఈ బ్యారేజీలో కేవలం 50 మీటర్ల ప్రాంతంలోనే సమస్య ఉందన్నారు.

 కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయని గుర్తు చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజీలు వచ్చాయన్నారు. వాటిని తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని గుర్తు చేశారు. నిపుణుల సలహాలతో మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరారు. మేడిగ‌డ్డ ప‌రిశీల‌న‌కు కేటీఆర్, హ‌రీశ్ రావు, క‌డియం శ్రీహ‌రి, ప్ర‌శాంత్ రెడ్డి, ద‌యాక‌ర్ రావు, నిరంజ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు వెళ్లారు.
Go Back to Shorts
KTR
medigadda
Kaleshwaram Project
BRS

More Telugu News