Bill Gates: 25 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చిన బిల్ గేట్స్

  • హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఐడీసీని ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సందర్శన
  • ఐడీసీ ఇంజనీర్లతో మాట్లాడిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు
  • కృత్రిమ మేధ భారత్‌కు అతిపెద్ద అవకాశం కాబోతోందని గేట్స్ చెప్పారన్న ఐడీసీ ఎండీ
Bill Gates came to Hyderabad after 25 years

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మొదటిసారి హైదరాబాద్‌ను సందర్శించారు. నగరంలో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ని (ఐడీసీ) ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

కృత్రిమ మేధ (ఏఐ) భారత్‌కు అతిపెద్ద అవకాశమన్న బిల్‌ గేట్స్‌ అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఏఐ ఆధారిత క్లౌడ్‌, సెక్యూరిటీ, గేమింగ్‌ విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం ఐడీసీ కృషి చేస్తోందని ఎండీ రాజీవ్‌ కుమార్ పేర్కొన్నారు. ఐడీసీ ఇంజనీర్లతో బిల్‌ గేట్స్‌ మాట్లాడారని మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ఎండీ రాజీవ్‌ కుమార్‌ వివరించారు. మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌,  సీఈవో సత్య నాదెళ్ల కూడా ఇటీవల భారత్‌లో పర్యటించారని, ఏఐ సాంకేతికత ఇండియాలో కీలకమవబోతోందని అభిప్రాయపడ్డ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఐడీసీకి మరింత ప్రాధాన్యం పెరుగుతోందని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.

కాగా హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ)ను ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయ్యింది. 1998లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చారు. మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత క్రమంగా ఐడీసీ వృద్ధి చెందింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాల్లో ఈ కేంద్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. అజూర్‌, విండోస్‌, ఆఫీస్‌, బింగ్‌, కోపైలెట్‌, కృత్రిమ మేధ (ఏఐ) వంటి మైక్రోసాఫ్ట్‌ ప్రపంచ స్థాయి ఉత్పత్తుల అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తోంది.

More Telugu News