Somireddy: టీడీపీ నేత సోమిరెడ్డిపై గునపంతో దాడికి యత్నం.. పోలీసులకు ఫిర్యాదు

YCP Leaders Attack On Somireddy Chandrashekar Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డిపై వైసీపీ కార్యకర్త ఒకరు దాడికి ప్రయత్నించాడు. గునపంతో వచ్చి పొడిచేస్తానంటూ వీరంగం వేశాడు. తనను అడ్డుకున్న టీడీపీ నాయకులను అసభ్యపదజాలంతో తిట్టాడు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి, స్థానిక నాయకుడి ఇంటిపై దాడి చేశాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టుపల్లిలో సోమవారం చోటుచేసుకుందీ ఘటన. దీనిపై సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ’ ప్రచారంలో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం కట్టుపల్లికి వెళ్లారు. సోమిరెడ్డిని ఆహ్వానిస్తూ టీడీపీ నేతలు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. వైసీపీ కార్యకర్తలు బల్లి వెంకటయ్య, సాయి, అంకయ్య, అయ్యప్ప వాటిని చించేశారు. దీంతో టీడీపీ నేతలు సోమవారం మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని కూడా చింపేసి, కర్రలను చెరువులో పడేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని దుర్భాషలాడారు. ఇంతలో సోమిరెడ్డి గ్రామానికి రావడంతో టపాసులు కాలుస్తూ స్వాగతించిన టీడీపీ స్థానిక నాయకులతో వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు.

స్థానిక నేతలు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంకటయ్య.. కాసేపటికి గునపంతో వచ్చి సోమిరెడ్డిపై దాడికి యత్నించాడు. గొడవ పెరుగుతుండడంతో సోమిరెడ్డితో పాటు ఇతర నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా స్థానిక టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి వెంకటయ్య బృందం దాడి చేసింది. ఇంటి కిటికీలు పగలకొట్టి, కారును ధ్వంసం చేశారు. చుట్టుపక్కల మహిళలు అడ్డుకోవడంతో వెంకటయ్య మిగతా వారితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలపైనా వెంకటయ్య బృందం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Go Back to Shorts
Somireddy
TDP
YCP leaders
Attack On somireddy
Nellore District
Andhra Pradesh

More Telugu News