పేటీఎం యాప్పై యూపీఐ చెల్లింపుల కొనసాగింపుపై ఆర్బీఐ కీలక ఆదేశాలు
- పేటీఎం యాప్పై యూపీఐ కార్యకలాపాల కొనసాగింపును పరిశీలించాలని ఎన్పీసీఐని కోరిన ఆర్బీఐ
- పేటీఎం యాప్ను థర్డ్ పార్టీ అప్లికేషన్గా మార్చే విషయాన్ని పరిశీలించాలని సూచన
- పేటీఎం ఖాతాలను 4-5 బ్యాంకులకు బదిలీ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరిన ఆర్బీఐ
మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు అకౌంట్స్లో కొత్తగా డిపాజిట్లు చేయడానికి వీల్లేదంటూ ఆర్బీఐ ఇటీవలే నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే వినియోగదారులకు నిరంతరాయ డిజిటల్ చెల్లింపుల సేవలు అందించడమే లక్ష్యంగా పేటీఎంని థర్డ్ పార్టీ అప్లికేషన్గా మార్చే అవకాశాలన్నీ పరిశీలించాలని ఎన్పీసీఐని ఆర్బీఐ సంప్రదించింది. పేటీఎం యాప్పై యూపీఐ సేవలను యథావిథిగా కొనసాగించేందుకు యాప్ని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్గా (టీపీఏపీ) మార్చడాన్ని పరిశీలించాలని కోరినట్టు స్పష్టత ఇచ్చింది.
ఈ మేరకు పేటీఎం మాతృసంస్థ ‘వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్’ తమను అభ్యర్థించిందని ఆర్బీఐ తెలిపింది. పేటీఎం బ్యాంక్ అకౌంట్ల బదిలీ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా 4-5 బ్యాంకులను పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (పీఎస్పీ) బ్యాంక్లను సూచించవచ్చునని, తద్వారా అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుంటుందని ఆర్బీఐ తెలిపింది. కాగా వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్లకు సంబంధించిన నోడల్ ఖాతాలు వీలైనంత త్వరగా రద్దు చేస్తారని తెలుస్తోంది. మార్చి 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి.