Botsa Satyanarayana: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

  • వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారన్న బొత్స
  • ఉమ్మడి రాజధాని వైసీపీ విధానం కాదని స్పష్టీకరణ
  • చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి రావడం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని విమర్శ
Botsa Satyanarayana on common capital Hyderabad

ఏపీకి రాజధాని ఏర్పడేంత వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. అనుభవం ఉన్న నాయకుడు ఎవరైనా ఇప్పుడు ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని అనేది వైసీపీ విధానం కాదని చెప్పారు. 

హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి రావడం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో ఓట్లు, డోర్ నెంబర్లు లేని వాళ్లు ప్రతిపక్ష నేతలుగా ఉన్నారని అన్నారు. రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు. విభజన చట్టంలో మనకు రావాల్సిన వాటి కోసమే ప్రయత్నిస్తామని అన్నారు. హైదరాబాద్ విశ్వనగరమని... అక్కడ ఎవరైనా ఉండొచ్చని చెప్పారు. తనకు కూడా హైదరాబాద్ లో ఇల్లు ఉందని అన్నారు. తాను ఏపీ మంత్రిని అయినంత మాత్రాన తన ఆస్తులను అక్కడి ప్రభుత్వం కబ్జా చేస్తుందా? అని ప్రశ్నించారు.

More Telugu News