BRS: మా మెడికల్ కాలేజీని రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తరలించుకుపోవడం సరైనదేనా?: గొంగిడి సునీత

  • కొట్లాడి యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీని మంజూరు చేయించుకున్నామన్న బీఆర్ఎస్ నాయకురాలు
  • ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఆసుపత్రి శంకుస్థాపన చేయలేదని వెల్లడి
  • ఆ తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ తరలించుకుపోయారని ఆరోపణ
Gongudi Sunitha fires at Revanth Reddy

యాదగిరిగుట్టకు మంజూరు చేసిన మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి తరలించుకు పోవడం సరైందేనా? అని బీఆర్ఎస్ నాయకురాలు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆమె ఆలేరులో మీడియాతో మాట్లాడారు. ఎయిమ్స్ కారణంగా మొదట మెడికల్ కాలేజీ ఇవ్వలేదని కేసీఆర్ చెప్పారని... ఆ తర్వాత కొట్లాడి యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీని మంజూరు చేయించుకున్నామన్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఆసుపత్రి శంకుస్థాపన చేయలేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీని కొడంగల్ తరలించుకుపోయారని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా మెడికల్ కాలేజీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి కార్యాచరణ తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే రిలే దీక్షలకు దిగుతామన్నారు. రేవంత్ భాష పట్ల అందరూ అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మాట తీరు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు.

More Telugu News