Gaddam Vivekanand: సుమన్ చెప్పు చూపించడానికి సూత్రధారి కేసీఆర్ : వివేక్ వెంకటస్వామి

  • కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామందిని బూతులు తిట్టారని వ్యాఖ్య
  • చెప్పు చూపించాల్సింది కేసీఆర్‌కే... ‌రేవంత్ రెడ్డికి కాదని వ్యాఖ్య
  • అధికారం పోయిందనే ఒత్తిడిలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారన్న వివేక్
Vivek Venkataswamy fires at Balka Suman for his comments on CM Revanth Reddy

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెబుతూ చెప్పు చూపించడానికి ప్రధాన కారణం కేసీఆరేనని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇలాంటి భాషను రాజకీయాల్లో ప్రారంభించింది కేసీఆరేనని మండిపడ్డారు. బాల్క సుమన్ చెప్పు చూపించాల్సింది రేవంత్ రెడ్డికి కాదని.. కేసీఆర్‌కు అని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటలకు ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామందిని బూతులు తిట్టారని ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గద్దర్‌లను కేసీఆర్ అవమానించారన్నారు. కాబట్టి చెప్పు చూపించాల్సింది కేసీఆర్‌కేనని బాల్క సుమన్‌కు చురక అంటించారు.

కేసీఆర్ బానిసత్వంలో బాల్క సుమన్ చాలా చిన్న వ్యక్తి అన్నారు. అధికారం పోయిందనే ఒత్తిడిలో బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పే వాస్తవాలను బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి తప్పు మీద తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నారు.

More Telugu News