మాల్దీవుల్లో సైన్యం ఉపసంహరణకు ఒప్పుకున్న భారత్!

 India agrees to replace military personnel in Maldives three aviation platforms by May 10
  • మాల్దీవుల్లోని భారత సైనిక సిబ్బందిని వెనక్కు తీసుకోవాలన్న అధ్యక్షుడు ముయిజ్జు
  • సైనిక సిబ్బంది స్థానంలో పౌర సిబ్బందిని రంగంలోకి దింపేందుకు అంగీకరించిన భారత్
  • మార్చ్ 10లోగా ఒక వాయుసేన స్థావరంలో పౌర సిబ్బంది మోహరింపు
  • మే 10 కల్లా మిగతా రెండు స్థావరాల్లోనూ పౌర సిబ్బంది నియామకం
మాల్దీవుల్లో భారత సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. మాల్దీవుల్లో భారత వాయుసేన కార్యకలాపాలు కొనసాగేలా పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు శుక్రవారం అంగీకరించాయి. మాల్దీవుల్లోని మూడు వాయుస్థావరాల్లో భారత సైనిక బలగాల స్థానంలో పౌర సిబ్బందిని నియమించేందుకు భారత్ అంగీకరించిందని మాల్దీవులు విదేశాంగ శాఖ ప్రకటించింది. మే 10లోపు సైనిక సిబ్బందిని వెనక్కు పిలిపించుకునేందుకు భారత్ అంగీకరించినట్టు తెలిపింది. 

మాల్దీవుల్లో చైనా అనుకూల నేత ముహమ్మద్ ముయిజ్జు అధ్యక్షుడయ్యాక భారత్‌తో ఎడం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి సైనిక దళాలను మార్చ్ 15లోగా ఉపసంహరించుకోవాలని ముయిజ్జు భారత్‌ను కోరారు. ఆ తరువాత ఇరు దేశాల మధ్య న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అంగీకారం కుదిరింది. మార్చ్ 10 కల్లా మాల్దీవుల్లోని ఓ వాయుసేన స్థావరంలో భారత్ సైనిక సిబ్బంది స్థానంలో పౌర సిబ్బందిని పంపేందుకు భారత్ అంగీకరించింది. మే కల్లా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో మాలేలో మరో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకూ ఇరు దేశాలు అంగీకరించాయి.

కాగా, మాల్దీవులతో పలు అంశాలపై చర్చ జరిగిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారం పెంపొందించే చర్యలు చేపట్టేందుకు అంగీకరించినట్టు పేర్కొంది. ఈ దిశగా చేపట్టిన ప్రాజెక్టులు త్వరిత గతిన పూర్తి చేస్తామని వెల్లడించింది. 

ప్రస్తుతం మాల్దీవుల్లో 80 మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు. అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు, ఒక సైనిక విమానం సాయంతో గత కొన్నేళ్లుగా పలు మానవతా మిషన్లు, ఇతర అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, ఇటీవల భారత్ సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనా సైనిక నావను కూడా తమ పోర్టులో ఆగేందుకు అనుమతించారు. మరోవైపు, ఈ దౌత్యవివాదాన్ని అవకాశంగా తీసుకున్న పాకిస్థాన్ మాలేకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. స్వయంగా ఆర్థికకష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం మాల్దీవులకు ఆర్థిక సాయం చేసేందుకు రెడీ అయ్యింది.
Go Back to Shorts
Maldives
India
Mohammed Muizzu
Narendra Modi

More Telugu News