సినిమా అవార్డులపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన... లేచివచ్చి సీఎంను ఆలింగనం చేసుకున్న మల్లు భట్టి... వీడియో ఇదిగో

CM Revanth Reddy announces Gaddar Awards in Telangana
  • రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం
  • గద్దర్ పేరిట కళాకారులకు అవార్డులు ఇస్తామని ప్రకటన
  • గద్దర్ అవార్డు పేరుతో త్వరలో జీవో విడుదల చేస్తామని వెల్లడి
సినిమా అవార్డులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో వేదిక పైనున్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లేచివచ్చి, ఆయనను వేదికపై ఆలింగనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సినీ ప్రముఖులు తనను కలవడానికి వచ్చి చాలా విషయాలను ప్రస్తావించారని... ఇందులో భాగంగా నంది అవార్డుల అంశాన్ని తీసుకు వచ్చారని గుర్తు చేశారు. గతంలో నంది అవార్డులు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని వారు కోరినట్లు తెలిపారు. అయితే నంది అవార్డులు కాదు కానీ... మా ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇస్తుందని వారికి చెప్పినట్లు వెల్లడించారు. గద్దర్ అవార్డు పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుంటామని తెలిపారు. నా మాటనే జీవో అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

గద్దర్ అవార్డు పేరు ప్రకటించడంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కమ్యూనిస్ట్ నాయకులు ఆయన నిర్ణయాన్ని ప్రశంసించారు. గద్దర్ పేరుతో కళాకారులకు పురస్కారాలను ప్రదానం చేస్తామని... ఇందుకు సంబంధించి త్వరలో జీవో విడుదల చేస్తామని సీఎం తెలిపారు.
Go Back to Shorts
Revanth Reddy
Gaddar
Mallu Bhatti Vikramarka
Congress
Tollywood

More Telugu News