ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై 'కుమారి ఆంటీ' రియాక్షన్
- ముఖ్యమంత్రి తన హోటల్ను తెరిపించాలని నిర్ణయించడం సంతోషకరమన్న కుమారి ఆంటీ
- రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల తాను చాలా హ్యాపీగా ఉన్నానని వెల్లడి
- ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించడం గొప్ప విషయమని హర్షం
తాను గత పదమూడేళ్లుగా స్ట్రీట్ ఫుడ్ను నిర్వహిస్తున్నానని కుమారి ఆంటీ తెలిపారు. తన హోటల్ తొలగింపుకు సంబంధించి మొదట తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. నిన్న 50 వేల రూపాయల ఫుడ్ వృథా అయిందన్నారు. తన ఫుడ్ కోర్టు బండిని సీజ్ చేశారని... తన కొడుకును కొట్టారని వాపోయారు. ఇంత జరిగాక మళ్ళీ హోటల్ తెరుస్తామని తాము అస్సలు అనుకోలేదని... తనలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి ఓ ముఖ్యమంత్రి స్పందించడం గొప్ప విషయం అన్నారు. అందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె వైరల్గా మారడంతో అక్కడకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందంటూ మంగళవారం ఆమె హోటల్ను పోలీసులు సీజ్ చేశారు. అక్కడి నుంచి హోటల్ను తొలగించాలన్నారు. అయితే తన ఒక్కదానినే ఇలా ఆదేశించడం ఏమిటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పందించారు.