Australia: ఆస్ట్రేలియా బీచ్‌లో మునిగి నలుగురు భారతీయుల మృతి

  • విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో ఘటన
  • మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు
  • సంతాపం తెలిపిన భారత హైకమిషన్
  • అవసరమైన సాయం అందిస్తామని వెల్లడి
Four Indians dead in Victoria Philip Island Beach in Australia

ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో స్నానాలకు వెళ్లిన నలుగురు భారతీయులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో ఈ ఘటన జరిగినట్టు కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ తెలిపింది. ఇది హృదయవిదారక ఘటన అని ఆవేదన వ్యక్తం చేసింది. 

బాధితుల స్నేహితులను సంప్రదించి అవసరమైన సాయం అందిస్తామని చెబుతూ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. జనవరి 24న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు బీచ్‌లో ప్రమాదంలో ఉన్నట్టు తమకు సమాచారం అందినట్టు విక్టోరియా పోలీసులు తెలిపారు. 

వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశామని, అయితే అప్పటికే ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారని, అపస్మారకస్థితిలో ఉన్న మరో మహిళను ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అక్కడామె చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. వీరి మృతి వెనక ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని, దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News