Marriage: ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు

  • వివాహ నమోదుకు ఇకపై రూ.500  
  • సెలవు రోజుల్లో అయితే రూ.5 వేల ఫీజు
  • మ్యారేజ్ రికార్డుల పరిశీలనకు ఇప్పుడున్న రూ.1 ఫీజు రూ.100కు పెంపు
Marriage Registration Charges Increased In AndraPradesh

ఆంధ్రప్రదేశ్ లో వివాహ నమోదు చార్జీలను పెంచుతూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (హిందూ) ఫీజులను సవరించింది. ఇప్పుడు ఉన్న ఫీజులను భారీగా పెంచేసింది. ప్రస్తుతం వివాహ నమోదుకు రూ.200 వసూలు చేస్తుండగా.. సవరించిన చార్జీల ప్రకారం ఇకపై రూ.500 సమర్పించుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ ను పెళ్లి వేదిక వద్దకు పిలిపించాలంటే అక్షరాలా ఐదు వేల రూపాయలు చెల్లించాలి. 

ఇప్పటి వరకు ఈ ఫీజు కేవలం రూ.210 మాత్రమే ఉంది. సెలవు రోజుల్లో వివాహ నమోదు ఫీజును కూడా రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మ్యారేజ్ రికార్డుల పరిశీలనకు నామమాత్రంగా రూ.1 వసూలు చేస్తుండగా ప్రభుత్వం దీనిని రూ.100 కు పెంచింది. మరోవైపు, వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ను ఇకపై ఆన్ లైన్ లోనూ నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

జగన్ సర్కారు నిర్ణయంపై ప్రతిపక్షం టీడీపీ మండిపడుతోంది. ‘పెళ్లికి జగన్ రెడ్డి బాదుడు’ అంటూ ట్విట్టర్ లో ఆరోపించింది. రాష్ట్రంలో అన్ని రకాల పన్నులు, చార్జీలు పెంచి, అన్ని వర్గాలను బాదేస్తున్న జగన్ కన్ను ప్రస్తుతం పెళ్లి జంటలపై పడిందని విమర్శించింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులనూ పెంచేశాడని ట్వీట్ చేసింది.

More Telugu News