Myanmar: ఆశ్రయం కోరుతూ భారత్‌లోకి వందలాదిమంది మయన్మార్ సైనికులు.. అమిత్ షాతో మిజోరం ముఖ్యమంత్రి చర్చలు

  • మిజోరంలోకి ప్రవేశించిన దాదాపు 600 మంది సైనికులు
  • అస్సాం రైఫిల్స్ శిబిరాల్లో తలదాచుకుంటున్న వైనం
  • అంతర్యుద్ధం నేపథ్యంలో భారత్‌లోకి మయన్మార్ ప్రజలు
  • 400 మందిని వెనక్కి పంపిన మిజోరం
600 Myanmar Soldiers Enter India

మయన్మార్‌లోని ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి సైన్యం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మొదలైన కల్లోల పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసన తెలిపిన ప్రజలను సైన్యం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. అయితే, ప్రజాస్వామ్య అనుకూల వాదులతో కూడిన తిరుగుబాటు దళాలు మాత్రం సైన్యానికి సవాలు విసురుతున్నాయి. ఈ రెండంటి మధ్య పోరు కొనసాగుతూనే ఉంది.

కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రజాస్వామ్య అనుకూలవాదులతో జరుగుతున్న పోరులో సైన్యానికి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో భారత సరిహద్దు రాష్ట్రమైన మిజోరంలోకి దాదాపు 600 మంది మయన్మార్ సైనికులు ప్రవేశించారు. వారి శిబిరాలను రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో మరోదారి లేక భారత్‌లోకి వచ్చిన వారంతా అస్సాం రైఫిల్స్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో వారిని తిరిగి మయన్మార్ పంపించాలంటూ మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ఆశ్రయం కోసం దేశంలోకి వస్తున్న మయన్మార్ ప్రజలకు సాయం చేస్తున్నామని, ఇప్పుడు సైనికులు కూడా వస్తున్నారంటూ మిజోరం ముఖ్యమంత్రి లాల్ దుహోమా కేంద్రమంత్రి అమిత్ షాకు తెలిపారు. ఆయన పలు విషయాలపై చర్చించినట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే 400 మందిని వెనక్కి పంపినట్టు చెప్పారు.

More Telugu News