వైసీపీకి రాజీనామా చేసిన వాసంశెట్టి సుభాష్.... రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
- కోనసీమ జిల్లాలో వైసీపీకి మరో నేత రాజీనామా
- వైసీపీలో అడుగడుగునా తనకు అవమానాలేనన్న వాసంశెట్టి
- తన కుటుంబాన్ని వేధిస్తున్నారని వెల్లడి
రాజీనామా ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీలో అడుగడుగునా అవమానాలేనని, అందుకే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. స్థానిక వైసీపీ నాయకత్వం గత ఏడాది కాలంగా తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన తల్లిని మున్సిపల్ చైర్ పర్సన్ చేస్తామని చెప్పారని, చాలా డబ్బు ఖర్చు పెట్టించారని, చివరి నిమిషంలో మాట మార్చారని ఆరోపించారు. వైసీపీ అధిష్ఠానం మంచి పదవిని ఇస్తానంటే... మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ అడ్డుకున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వైసీపీలో కొనసాగలేనని సుభాష్ పేర్కొన్నారు.