టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా: రఘురామకృష్ణరాజు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత సొంతూరికి చేరుకుని ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. 

ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ, సొంత నియోజకవర్గానికి రాకుండా ఇన్నాళ్లూ ఇబ్బందిపెట్టారని వ్యాఖ్యానించారు. చాన్నాళ్ల తర్వాత సొంత నియోజకవర్గానికి వచ్చిన తనకు టీడీపీ, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారని వెల్లడించారు. టీడీపీ-జనసేన కలిసిన రోజే ఏపీ కోస్తాలో వైసీపీ పనైపోయిందని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.  ఫిబ్రవరి రెండో వారంలో వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని వెల్లడించారు. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు. 

అయోధ్య ఆలయం ప్రారంభం తర్వాత ఏపీలో బీజేపీతో... టీడీపీ-జనసేన పొత్తుపై స్పష్టత వస్తుందని అన్నారు. మూడు పార్టీలు  కలిసే ఎన్నికలకు వెళతాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రఘురామ ఎన్నికల సమరోత్సాహం ప్రదర్శించారు.


More Telugu News