హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న బస్సు బోల్తా.. మహిళ సజీవ దహనం

  • గద్వాల జోగులాంబ జిల్లాలోని ఎర్రవల్లి సమీపంలో ఘటన
  • బస్సు బోల్తా పడిన వెంటనే అంటుకున్న మంటలు
  • అందరూ తప్పించుకున్నా ఒక్క మహిళ మాత్రం చిక్కుకుపోయి మృతి
  • మరో నలుగురికి గాయాలు
  • కొంపముంచిన డ్రైవర్ నిద్రమత్తు
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గత అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాలోని ఎర్రవల్లి సమీపంలో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి.

ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ప్రయాణికులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. బస్సులోని మిగతా అందరూ ఎలాగోలా బయటకు వచ్చి తప్పించుకున్నా ఒక్క మహిళ మాత్రం రాలేక చిక్కుకుపోయింది. అప్పటికే మంటలు చుట్టుముట్టేయడంతో మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. మృతురాలిని గుర్తించాల్సి ఉంది.

Road Accident
Jogulamba Gadwal District
Hyderabad
Private Travel Bus

More Telugu News