జగన్ ఆలోచించి నాకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నా: ఎమ్మెల్యే పెండెం దొరబాబు

  • పిఠాపురం ఇన్ఛార్జీగా వంగా గీతను నియమించిన జగన్
  • తీవ్ర అసంతృప్తికి గురైన పెండెం దొరబాబు
  • నియోజకవర్గంలో తనకే పట్టు ఉందన్న ఎమ్మెల్యే
పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎం జగన్ ఈసారి టికెట్ ను ఇవ్వడం లేదంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన బలప్రదర్శన చేశారు. తన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని అనుచరులకు ఆయన ఈరోజు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చారు. 

ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ... పిఠాపురం స్థానంపై జగన్ పునరాలోచించాలని చెప్పారు. ఈ నియోజకవర్గంలో తనకే ఎక్కువ పట్టు ఉందని... తన జన్మదిన వేడుకలకు వేలాది మంది హాజరై మద్దతు తెలిపారని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. జగన్ ఆలోచించి తనకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. 

మరోవైపు, ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జగన్ ఫొటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇన్ఛార్జీగా నియమించారు. దీంతో, ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జనసేనలోకి ఆయన వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.


More Telugu News

Pendem Dorababu Jagan YSRCP