Revanth Reddy: జిల్లాల బాట పట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి.. లోక్ సభ ఎన్నికలే టార్గెట్!

  • నెల రోజుల్లో పాలనపై తనదైన ముద్ర వేసిన రేవంత్
  • పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సత్తా చాటేలా వ్యూహ రచన చేస్తున్న సీఎం
  • ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనలకు శ్రీకారం
CM Revanth Reddy district tours

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన రేవంత్ రెడ్డి... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బాధ్యతలను చేపట్టిన నెల రోజుల కాలంలోనే పాలనపై ఆయన తనదైన స్పష్టమైన ముద్రను వేయగలిగారు. పార్టీలోని సీనియర్లందరికీ తగు గౌరవం ఇస్తూ... పార్టీలో అంతర్గతంగా ఎలాంటి అసంతృప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. 

రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కనీసం 12 స్థానాలను కైవసం చేసుకునే దిశగా రేవంత్, పార్టీ సీనియర్లు టార్గెట్ నిర్దేశించుకున్నారు. నిన్న ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభను నిర్వహించనున్నట్టు ఆ జిల్లా నేతలకు చెప్పారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు.

More Telugu News