పబ్లిక్ మీటింగ్ లో రజనీకాంత్ డైలాగ్ కొట్టిన టీడీపీ అధినేత

Chandrababu says Rajinikanth dialogue
  • పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో రా కదిలిరా సభ
  • హాజరైన చంద్రబాబు
  • "రాజా ఇప్పటికైనా అర్థమైందా" అంటూ సినీ ఫక్కీలో కామెంట్
  • విశ్వసనీయత అంటే జగన్ దే అంటూ ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సభలో వాడీవేడిగా ప్రసంగించారు. జిల్లాలో ఏ ఒక్క రోడ్డయినా బాగుందా, ఏ కాలువ అయినా పూడిక తీశారా, ఏ డ్రైనేజిలో అయినా పూడిక తీశారా? అని ప్రశ్నించారు. అందుకే రజనీకాంత్ డైలాగ్ చెబుతున్నా... రాజా ఇప్పటికైనా అర్థమైందా? అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా తలైవా డైలాగ్ సంధించారు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా? రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలి అని పిలుపునిచ్చారు.

"ఇక, ఇక్కడి ఎమ్మెల్యే తాను ఆకాశం నుంచి ఊడిపడ్డానని అనుకుంటున్నాడు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాం అంటే వీళ్లబ్బ సొత్తులా అడ్డుపడ్డాడు... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నువ్వు విజిలెన్స్ పంపిస్తావా, బెదిరిస్తావా? నేను తలుచుకుంటే ఈ జిల్లాలో నువ్వు వ్యాపారాలు చేసేవాడివా?" అంటూ స్థానిక ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు. 

ఆనాడు పోలవరాన్ని పరిగెత్తించాను!

ఆచంట సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం అంశం ప్రస్తావించారు. ఆనాడు తాను సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిగెత్తించానని తెలిపారు. సోమవారం పోలవరంగా మార్చుకున్నానని వివరించారు. 72 శాతం పనులు పూర్తి చేశానని వెల్లడించారు. 

"ఎవరైనా చేతగానివాడు వస్తే అసమర్థుడు అంటాం. ఒక దుర్మార్గుడు వచ్చి విధ్వంసం సృష్టిస్తే ఏమనాలి? 2019లో పోలవరానికి గ్రహణం పట్టింది. జగన్ అధికారంలోకి వస్తూనే కాంట్రాక్టర్ ను మార్చేశాడు. అధికారులను మార్చాడు. రెండు పర్యాయాలు భారీ వరద రావడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. కాఫర్ డ్యామ్ మధ్యలోకి నీళ్లు వచ్చేశాయి, గైడ్ బండ్ కుంగిపోయింది. పోలవరానికి గ్రహణం పోవాలంటే ఈ జగన్ పోవాలి" అని వ్యాఖ్యానించారు. 

విశ్వసనీయత గురించి ఈ జగన్ చెబితేనే వినాలి!

విశ్వసనీయత గురించి జగన్ చెబుతుంటాడని, మాట తప్పను... మడమ తిప్పను అంటుంటాడని విమర్శించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగన్ లో విశ్వసనీయత కూడా అంతేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

"కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని గత ఎన్నికల ముందు చెప్పాడా లేదా? ఎన్నికలు  అయిపోయాక ఏం చేశాడు... కేంద్రం ముందు తానే మెడలు వంచాడు. కేసులకు భయపడి కేంద్రానికి లొంగిపోయాడు" అంటూ ధ్వజమెత్తారు. 

"ఉద్యోగాలు ఇస్తానన్నాడు... ఇచ్చాడా? జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు... ఇచ్చాడా? డీఎస్సీ నోటిఫికేషన్ అన్నాడు... ఇచ్చాడా? ఈ ఐదేళ్లలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా?" అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందే... అది నా విశ్వసనీయత అని స్పష్టం చేశారు. "కరెంటు చార్జీలు తగ్గిస్తానని చెప్పి తొమ్మిది సార్లు పెంచాడు. అది లెక్కలేనితనం... చెప్పిన అబద్ధాలు చెప్పకుండా బతుకుతున్నాడు. నాణ్యమైన కరెంటు రావాలన్నా, మళ్లీ కరెంటు చార్జీలు పెంచకుండా ఉండాలంటే టీడీపీ-జనసేన ప్రభుత్వం రావాల్సిందే" అని ఉద్ఘాటించారు. 

"ఎన్నికల ముందు అమరావతే మన రాజధాని... ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అని మాయ మాటలు చెప్పాడు. ఎన్నికలయ్యాక మాట మార్చాడు... ఊసరవెల్లి రాజకీయాలు చేశాడు. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నాడు... అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితి తీసుకువచ్చాడు. ఇటీవల విశాఖపట్నం వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. నువ్వు ఎక్కడికీ పోవడానికి లేదు... నువ్వు అమరావతిలోనే ఉండాలి అంటూ కోర్టు మొట్టికాయలు వేసింది. 

ఇప్పుడు చెబుతున్నా... నీ టైమ్ అయిపోయింది... అమరావతే మన రాజధాని. ఐదేళ్లు  మనకు రాజధాని లేకుండా చేసింది ఈ జగన్ మోహన్ రెడ్డి బోగస్ విశ్వసనీయత" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
Go Back to Shorts
Chandrababu
Rajinikanth
Achantra
TDP
Jagan
YSRCP
West Godavari District

More Telugu News