త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తా.. కేశినేని నాని సంచలన ప్రకటన

  • త్వరలోనే లోక్‌సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటన
  • తాను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు భావించాక కొనసాగడం సబబుకాదన్న నాని
  • ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేసిన విజయవాడ ఎంపీ
విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని శుక్రవారం మీడియాకు తెలిపిన టీడీపీ నేత కేశినేని నాని ఈ రోజు (శనివారం) సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్‌ని కలిసి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ నేను పార్టీకి అవసరంలేదని చంద్రబాబు నాయుడు గారు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదనేది నా భావన’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరిలతో తానున్న ఫొటోని ఈ సందర్భంగా నాని షేర్ చేశారు.

ఇదిలావుంచితే కేశినేని నాని శుక్రవారం ఉదయం రాజకీయపరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని, ఈ మేరకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ గురువారం సాయంత్రం వచ్చి తనకు చెప్పారని అన్నారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు, తనను జోక్యం చేసుకోవద్దని చెప్పారని ప్రకటించిన విషయం తెలిసిందే.

Kesineni Nani
Telugudesam
Chandrababu
Vijayawada
Andhra Pradesh

More Telugu News