Mukesh Ambani: 2023లో 10 బిలియన్‌ డాలర్లు ఆర్జించిన ముకేశ్‌ అంబానీ

  • 97.1 బిలియర్ డాలర్లతో మరోసారి సంపన్న భారతీయుడిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
  • హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్‌తో 2023లో 37.3 బిలియన్ డాలర్లు నష్టపోయిన గౌతమ్ అదానీ
  • ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్
  • బ్లూమ్‌బర్గ్-2023 సంపన్నుల జాబితా విడుదల
Mukesh Ambani earned 10 billion dollars in 2023

భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ సంపద 2023లో ఏకంగా 9.98 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందింది. దీంతో ఆయన నికర సంపద విలువ 97.1 బిలియన్ డాలర్లకు పెరిగి భారత్‌లో అత్యంత సంపన్న వ్యక్తిగా మరోసారి నిలిచారని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 13వ స్థానంలో నిలిచారని తెలిపింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ షేర్లు 2023లో గణనీయంగా 9 శాతం మేర లాభపడడం సంపద పెరుగుదలకు దోహదపడిందని తెలిపింది. ఇక అదానీ గ్రూపు కంపెనీల అధినేత గౌతమ్‌ అదానీ సంపద ఈ ఏడాది భారీగా క్షీణించింది. ‘హిండెన్‌బర్గ్‌’ రిపోర్ట్ ప్రభావంతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు భారీగా కుంగడం ఇందుకు కారణమైంది. 2023లో ఆయన 37.3 బిలియన్‌ డాలర్ల సంపదను నష్టపోయారు. అయినప్పటికీ 83.2 బిలియన్‌ డాలర్లతో భారతీయ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. 

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్‌ నడార్‌ సంపద 2023లో 9.47 బిలియన్‌ డాలర్ల మేర వృద్ధి చెంది 34 బిలియన్‌ డాలర్లకు చేరింది. హెచ్‌సీఎల్‌ కంపెనీ షేరు 41 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. జిందాల్‌ గ్రూపు చైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ 8.93 బిలియన్‌ డాలర్లు, ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా 7.09 బిలియన్‌ డాలర్లు, సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ 5.26 బిలియన్‌ డాలర్లు, ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ 3.62 బిలియన్‌ డాలర్లు చొప్పున సంపదను వృద్ధి చేసుకున్నారు. కాగా డీ-మార్ట్‌ అధినేత రాధాకృష్ణ దామాని 187 మిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు.

ఇక ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం ‘టెస్లా’ అధినేత అగ్రస్థానంలో ఉన్నారు. 2022లో 138 బిలియన్ డాలర్లు నష్టపోయిన ఆయన 2023లో 95.4 బిలియన్ డాలర్లు ఆర్జించి అగ్రస్థానంలో నిలిచారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా 500 మంది శ్రీమంతుల సంపద 1.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది.

More Telugu News