Narendra Modi: నేడు అయోధ్యలో మోదీ పర్యటన, పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం

  • అయోధ్యలో ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న మోదీ
  • ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడి
Determined To Preserve Its Rich Heritage PM Modi Ahead Of Ayodhya Visit

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన మోదీ.. అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 

‘‘శ్రీరాముడి నగరమైన అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలికవసతుల ఏర్పాటు, కనెక్టివిటీ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తాను. అంతేకాకుండా, ఇతర కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేస్తాను. దీంతో, అయోధ్య నగర ప్రజల జీవనం మరింత మెరుగవుతుంది’’ అని ప్రధాని మోదీ హిందీలో పోస్ట్ చేశారు. 

ఉదయం 11.15 నిమిషాలకు ప్రధాని మోదీ అయోధ్యలో ఆధునికీకరించిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తరువాత అమృత్ భారత్, వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కొత్త ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.00 గంటకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

More Telugu News