నగరి నుంచి నన్ను మార్చుతారని అనుకోవడంలేదు: మంత్రి రోజా
- ఇటీవల 11 నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చిన సీఎం జగన్
- వైసీపీ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం
- తనకు సీటు ఇవ్వకపోయినా సంతోషంగా త్యాగం చేస్తానన్న మంత్రి రోజా
"మొదట ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేద్దామని భావించాను. కానీ జగన్ గారు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. మొదటి నుంచి నేను ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను కాబట్టి నన్ను మార్చుతారని నేను అనుకోవడంలేదు. ఒకవేళ నా నియోజకవర్గం నుంచి నన్ను మార్చాల్సిన పరిస్థితి వస్తే కూడా అన్న కోసం సంతోషంగా త్యాగం చేస్తా.
అన్నను బెదిరించి విపక్షంలో చేరినా మనకు మిగిలేది శూన్యమే. వైసీపీలో ఉంటూ, పార్టీ విజయం కోసం కష్టపడేవారికి ఎవరెవరికి ఏమేం చేయాలో జగనన్నకు తెలుసు. మొత్తం 175 స్థానాలు గెలిచే ప్రణాళికలో భాగంగా ఎక్కడ ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే జగన్ గారు మార్చుతున్నారు. దీనిపై ఎక్కడా వివాదం లేదు. జగన్ నిర్ణయాన్ని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు" అంటూ రోజా వివరించారు.