Reels To Death: రీల్స్ చూసి అనుకరించే ప్రయత్నం.. ఉరి బిగుసుకుని 11 ఏళ్ల బాలుడి మృతి

  • ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలో ఘటన
  • రీల్స్ చూసి తల్లి స్కార్ఫ్‌తో ఉచ్చు
  • ప్రమాదవశాత్తు మెడకు బిగుసుకుపోవడంతో మృతి
5th Class Student emulates act seen in reels in UP leads to death

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్‌ జిల్లా రబీంద్రనాథ్ ఠాగోర్ నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. రీల్స్‌ను అనుకరిస్తూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. నిన్న మధ్యాహ్నం స్కూలు నుంచి వచ్చిన బాలుడు మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో ప్రాణాలు కాపాడుకునే టెక్నిక్ చూపించే రీల్ బాలుడిని ఆకర్షించింది. 

వెంటనే దానిని అనుకరించే ప్రయత్నం చేశాడు. తల్లి స్కార్ఫ్‌ను తీసుకుని ఉచ్చులా తయారుచేసి మెడచుట్టూ  వేసుకున్నాడు. ఈ క్రమంలో అది ప్రమాదవశాత్తు బిగుసుకోవడంతో ఊపిరి అందక ప్రాణాలు విడిచాడు. స్కార్ఫ్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసి అప్రమత్తమైన తల్లి వెంటనే అది విప్పి ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.

ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకున్నా, సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News