ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు సరిగ్గా అమలు కావడం లేదు: గల్లా జయదేవ్

  • ఓటర్ల జాబితాను రూపొందించే విషయంలో అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న టీడీపీ ఎంపీ
  • ఈసీ ఆదేశాలను డీఆర్‌వోలు, స్థానిక సిబ్బంది పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపాటు
  • కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో గళమెత్తిన టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈసీ ఆదేశాలను డీఆర్‌వోలు, స్థానిక సిబ్బంది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఓటర్ల లిస్ట్‌ను పారదర్శకంగా రూపొందించే విషయంలో అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం, విధివిధానాల బిల్లుపై లోక్‌సభలో చర్చలో జయదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఓటర్ల లిస్టులో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని, దొంగ ఓట్లు నమోదవుతున్నాయని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ ప్రధాన విధి అని, కానీ ఆంధ్రప్రదేశ్‌ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని విపక్ష టీడీపీ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తల పేర్లను తొలగిస్తున్నారంటూ ఇప్పటికే ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే.

Galla Jayadev
Central Election Commission
Andhra Pradesh
Telugudesam

More Telugu News