చైనా వెల్లుల్లితో జాతీయ భద్రతకు ముప్పు..అమెరికా సెనెటర్ ఆందోళన
- వెల్లుల్లి పెంపకంలో చైనా అపరిశుభ్ర పద్ధతులు అవలంబిస్తోందన్న సెనెటర్ రిక్ స్కాట్
- చైనా వెల్లుల్లితో జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి ముప్పని ఆందోళన
- వెల్లుల్లి దిగుమతులపై దర్యాప్తు జరపాలంటూ వాణిజ్య శాఖ సెక్రెటరీకి ఫిర్యాదు
తాజా వెల్లుల్లితో పాటు చిల్డ్ గార్లిక్ ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే అగ్రగామి కాగా అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. వెల్లుల్లి విషయంలో కొన్ని ఏళ్లుగా అమెరికా, చైనా మధ్య విభేదాలు నెలకొన్నాయి. చైనా అతి తక్కువ ధరలకు వెల్లుల్లిని తీసుకొచ్చి తమ దేశంలో కుమ్మరిస్తోందంటూ అమెరికా గతంలో ఆరోపించింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు చైనా దిగుమతులపై రకరకాల చార్జీలు కూడా బాదింది.
నిపుణుల ప్రకారం, చైనా వెల్లుల్లి దేశీ రకాల కంటే పెద్దవిగా, తెల్లగా ఉంటాయి. అయితే, చైనా వెల్లుల్లిపై అమెరికాలో ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకరమైన లోహాలు, ఇతర విషతుల్యాలతో కలుషితమైన మురుగునీటిని ఎరువుగా వాడి వెల్లుల్లి పెంచుతారన్న ఆరోపణలు ఉన్నాయి. లోహాల విషయం అటుంచితే, చెట్లకు మురుగునీరు ఎరువుగా వాడటంలో తప్పేమీ లేదని నిపుణులు చెబుతున్నారు.