Indian student: లండన్ నదిలో భారతీయ విద్యార్థి మృతదేహం గుర్తింపు

  • నవంబర్‌ నెలలో మిస్సింగ్ అయిన మిత్‌కుమార్ పటేల్ కథ విషాదాంతం
  • థేమ్స్ నదిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
  • కుటుంబానికి సాయం చేసేందుకు నిధులు సమీకరణ ప్రారంభించిన బంధువులు
Indian student found dead in London river

నవంబర్‌ నెలలో బ్రిటన్‌లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి 23 ఏళ్ల మిత్ కుమార్ పటేల్ కథ విషాదాంతమైంది. థేమ్స్ నదిలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. ఉన్నత చదువుల కోసం మిత్‌కుమార్ సెప్టెంబరులో యూకే వెళ్లాడు. నవంబర్ 17న అదృశ్యమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. నవంబర్ 21న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలోని థేమ్స్ నదిలో అతడి మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. ఈ మరణం అనుమానాస్పదంగా లేదని ప్రకటించారు.

మిత్‌కుమార్ పటేల్ వ్యవసాయ కుటుంబానికి చెందిన యువకుడు కావడంతో అతడి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నట్టు అతడి బంధువు పార్త్ పటేల్ అనే వ్యక్తి వెల్లడించాడు. ‘గో ఫండ్ మీ’ ఆన్‌లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించామని తెలిపాడు. వారం వ్యవధిలో జీబీపీ(గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) 4,500కి పైగా వచ్చాయని తెలిపాడు. మిత్‌కుమార్ వయసు 23 సంవత్సరాలని, 19 సెప్టెంబర్ 2023న యూకే వచ్చాడని వివరించాడు.

మిత్‌కుమార్ రైతు కుటుంబానికి చెందిన యువకుడని, నవంబర్ 17, 2023 నుంచి కనిపించకుండా పోయాడని వివరించాడు. నవంబర్ 21న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారని వివరించాడు. ఉన్నత చదువుల కోసం వచ్చిన వ్యక్తి ఈ విధంగా చనిపోవడం బాధ కలిగిస్తోందని, అతడి కుటుంబానికి సహాయం చేయాలని భావించామని చెప్పాడు. మిత్‌కుమార్ మృతదేహాన్ని భారత్‌కు పంపిస్తామని అన్నాడు. ఇక మిత్‌కుమార్ షెఫీల్డ్ హాలమ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదవడానికి వెళ్లాడని నవంబర్ 20న షెఫీల్డ్‌కు వెళ్లాడని సమాచారం. వాకింగ్‌కు వెళ్లిన అతడు ఎంతసేపటికీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News