SIM Cards: డిసెంబరు 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్

New rules for SIM Card issuing
  • సిమ్ కార్డుల జారీ మరింత కట్టుదిట్టం
  • సిమ్ కార్డు విక్రయదారులకు రిజిస్ట్రేషన్
  • పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి
  • నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల పెనాల్టీ
  • వినియోగదారులకు ఆధార్ స్కాన్, డెమోగ్రఫీ డేటా సేకరణ తప్పనిసరి
సిమ్ కార్డు విక్రయాల్లో పారదర్శకత, నకిలీ సిమ్ కార్డు విక్రయాలకు కళ్లెం వేసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు వీలుగా కేంద్రం సిమ్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇకపై సిమ్ కార్డులు విక్రయించే వారు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 

పోలీసులు కూడా సిమ్ విక్రయదారుల ఐడెంటిటీని నిర్ధారించాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ బాధ్యత టెలికాం ఆపరేటర్ దే. అంతేకాదు, టెలికాం సంస్థలు సదరు సిమ్ కార్డు విక్రయ దుకాణాలకు వెళ్లి కేవైసీ వెరిఫికేషన్ చేయాలి. ఈ నిబంధనలు పాటించని విక్రయదారులకు రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. సిమ్ కార్డు విక్రేతలు నవంబరు 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 

అదే సమయంలో, వినియోగదారులు సిమ్ కార్డులు కొనుగోలు చేసే సమయంలో ఆధార్ స్కాన్, డెమోగ్రఫీ డేటా సేకరణ తప్పనిసరి చేశారు. ఒక వ్యక్తి ఒక ఐడీపై 9 సిమ్ కార్డుల వరకు పొందవచ్చు. ఏదైనా సిమ్ కార్డు సేవలు రద్దయితే... 90 రోజుల తర్వాతే ఆ సిమ్ ను మరొకరికి కేటాయిస్తారు. సిమ్ కార్డుల జారీ మరింత కట్టుదిట్టం చేసేందుకు ఈ నిబంధనలు తీసుకువచ్చారు. 

డిసెంబరు 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. వాస్తవానికి ఈ రూల్స్ అక్టోబరు నుంచి అమల్లోకి తీసుకురావాలని భావించగా, వివిధ కారణాలతో రెండు నెలలు వాయిదా వేశారు.

More Telugu News

SIM Cards
Rules
Seller
User
India