Abdul Rajaq: మరోసారి నోరు పారేసుకున్న అబ్దుల్ రజాక్.. ఈసారి టీమిండియాపై..!

  • వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా ఓటమిపై కామెంట్స్
  • క్రికెట్ విజేతగా నిలిచిందంటూ ట్వీట్ చేసిన రజాక్
  • సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న ట్రోలర్స్
Pakistan Former Cricketer Abdul Rajaq Contraversial Comments on TeamIndia

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ మరోమారు నోరుపారేసుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని ఎత్తిచూపుతూ కామెంట్స్ చేశాడు. క్రికెట్ గెలిచిందంటూ ట్వీట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలర్స్ రజాక్ పై విరుచుకుపడుతున్నారు. రజాక్ తన నోటి దురుసును తగ్గించుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. ఇటీవలే మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ పై రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఫైనల్ మ్యాచ్ ఫలితంపై అబ్దుల్ రజాక్ స్పందిస్తూ.. వరల్డ్ కప్ ఫైనల్ లో క్రికెట్ విశ్వవిజేతగా నిలిచిందని ట్వీట్ చేశాడు. స్వదేశంలోని పరిస్థితులను అడ్వాంటేజ్ గా తీసుకుని టీమిండియా గెలిస్తే క్రికెట్ కు బాధాకరమైన క్షణాలే మిగిలేవని అన్నాడు. వరల్డ్ కప్ ను టీమిండియా సొంతం చేసుకుంటే చాలా బాధపడేవాడినని చెప్పాడు. అయితే, మానసికంగా దృఢంగా ఉన్న జట్టే అంతిమ విజేతగా నిలిచిందని చెప్పుకొచ్చాడు. వాతావరణం, పిచ్ ఇరు జట్లకూ సమంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ లో ఒకవేళ కోహ్లీ కనుక సెంచరీ చేసి ఉంటే టీమిండియానే గెలిచేదని రజాక్ చెప్పాడు.

రజాక్ పోస్టుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా మాట్లాడడం నీ తెలివితక్కువతనానికి నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు. ఫైనల్ మ్యాచ్ రోజు టీమిండియాకు కలిసి రాలేదని మరో యూజర్ కామెంట్ చేశాడు. విమర్శలు ఎన్నటికీ సహేతుకంగా ఉండాలని సూచించాడు. అనవసరమైన విషయాలను వదిలిపెట్టి పాకిస్థాన్ క్రికెట్ ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టకపోతే ఆసియా కప్ లాగే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు నీళ్లు వదులుకోవాల్సి ఉంటుందని హితవు పలికాడు. అబ్దుల్ రజాక్ మాటల్లో కేవలం భారత్ పై ఈర్ష్య, అసూయ, అక్కసు మాత్రమే కనిపిస్తున్నాయని మరో యూజర్ మండిపడ్డాడు.

More Telugu News