సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థుల్ని గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గమిదే!: తుమ్మల నాగేశ్వరరావు

సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థులను గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం సత్తుపల్లి అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేర్వేరు కాదన్నారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అన్నారు. అధికార పార్టీ వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని, కానీ జనశక్తి ముందు ఆ డబ్బులు ఏమీ చేయలేవన్నారు. శనివారం కుప్పెనకుంట్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయసమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలకోసం తాను చిత్తశుద్ధితో యజ్ఞంలా రాజకీయం చేశానన్నారు. సీతారామ ప్రాజెక్టు ఇస్తానంటేనే తాను బీఆర్ఎస్‌లో చేరానన్నారు. 

తన చిన్నప్పుడే ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేశానని చెప్పారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని, వాటి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. సత్తుపల్లి అభ్యర్థి మట్టా రాగమయిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పది రోజులు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కష్టపడాలని, ఆ తర్వాత ప్రజల కోసం మేం కష్టపడతామన్నారు. తాను నాలుగు దశాబ్దాలుగా ప్రజా అభిమానంతో రాజకీయం చేస్తున్నానన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ గెలుస్తుందని, 9వ తేదీన ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Thummala
Congress
Telangana Assembly Election

More Telugu News