Air Tickets: వరల్డ్ కప్ ఫైనల్ పుణ్యమా అని విమాన టికెట్ రేట్లకు రెక్కలొచ్చాయి!

  • ముగింపు దశకు చేరుకున్న వరల్డ్ కప్
  • ఈ నెల 19న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్
  • టైటిల్ కోసం టీమిండియా, ఆసీస్ అమీతుమీ
  • టీమిండియా ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ కు బయల్దేరుతున్న ఫ్యాన్స్
Air Ticket rates raises high due to world cup final

భారత్ లో గత కొన్ని వారాలుగా ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్న వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది. ఎల్లుండి (నవంబరు 19) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. 

ఇక అసలు విషయానికొస్తే... వరల్డ్ కప్ ఫైనల్ కారణంగా దేశంలో విమాన టికెట్ రేట్లకు రెక్కలొచ్చాయి. అక్టోబరు 5న వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం కాగా, దేశంలో క్రికెట్ లవర్స్ వరల్డ్ కప్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. టీమిండియా ఫైనల్ కు చేరడంతో వీరాభిమానులందరూ అహ్మదాబాద్ బయల్దేరుతున్నారు. 

సాధారణంగా బెంగళూరు నుంచి అహ్మదాబాద్ కు విమాన టికెట్ ధర రూ.5,700. కానీ ఫైనల్ మ్యాచ్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో ఇప్పుడా టికెట్ ధర రూ.33 వేలు పలుకుతోంది. గురువారం సాయంత్రం నుంచే విమాన టికెట్ల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఇండిగో తదితర విమానయాన సంస్థల విమానాలన్నింటిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆకాశ ఎయిర్ లో కాస్త తక్కువగా రూ.28,778కి బెంగళూరు-అహ్మదాబాద్ టికెట్ లభిస్తోంది. 

అభిమానులు మాత్రం ఇవేవీ లెక్కచేయడం లేదు. ఇప్పటికే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను స్టేడియంలో వీక్షించేందుకు టికెట్లు కొనుగోలు చేసినవారు అహ్మదాబాద్ పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

More Telugu News