మీకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చా!: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి

Revanth Reddy campaign in Kamareddy
  • కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పండే పంట క్వింటాల్ రూ.4వేలకు పైగా విక్రయిస్తున్నారని వెల్లడి 
  • కామారెడ్డి రైతుల వరిని క్వింటాల్ రూ.2వేల లోపు ఎందుకు కొంటున్నారన్న రేవంత్  
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన కామారెడ్డి జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావ్? అని తనను అందరూ అడుగుతున్నారని, అయితే మీకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చానన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆత్మహత్యలు చేసుకున్న యువత, రైతులను చూసేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు రావడం లేదని విమర్శించారు. అందుకే మీకు అండగా ఉండేందుకు వచ్చానని చెప్పారు. కామారెడ్డి ప్రజల భూములను కాపాడే బాధ్యత తనదే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్నారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో పండించిన వడ్లను క్వింటాల్‌కు రూ.4వేలకు పైగా అమ్ముకుంటున్నారని, కానీ కామారెడ్డి రైతుల వరిని క్వింటాల్ రూ.2వేల లోపు ఎందుకు కొంటున్నారని నిలదీశారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
BRS
Telangana Assembly Election

More Telugu News