జయప్రదపై గతంలో నాన్ బెయిలబుల్ వారెంట్... ఈ నెల 17న కోర్టుకు రావాలన్న జడ్జి
- గత లోక్ సభ ఎన్నికల సమయంలో జయప్రదపై కేసు
- కోడ్ అమల్లో ఉన్నప్పటికీ రోడ్డు ప్రారంభించారంటూ ఆరోపణలు
- ఈ నెల 8న విచారణకు గైర్హాజరైన జయప్రద
- మరోసారి ఆదేశాలు జారీ చేసిన రాంపూర్ కోర్టు
ఈ కేసులో ఆమె నవంబరు 8న విచారణకు హాజరు కావాల్సి ఉంది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినప్పటికీ జయప్రద విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో ఉత్తరప్రదేశ్ రాంపూర్ న్యాయస్థానం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. జయప్రద నవంబరు 17న కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఈ కేసుపై ప్రాసిక్యూషన్ అధికారి స్పందిస్తూ, జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా ఆమె ఈ నెల 8న విచారణకు హాజరు కాలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసినట్టు తెలిపారు.
2019 ఎన్నికల్లో జయప్రద బీజేపీ అభ్యర్థిగా రాంపూర్ బరిలో పోటీ చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజమ్ ఖాన్ చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. అజమ్ ఖాన్ కు 5.59 లక్షల ఓట్లు రాగా, జయప్రదకు 4.48 లక్షల ఓట్లు లభించాయి.