వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: రఘురామకృష్ణరాజు

  • వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీగానే పోటీ చేస్తానన్న రఘురాజు
  • నరసాపురం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడి
  • టీడీపీ, జనసేన కూటమి భారీ మెజర్టీతో గెలుస్తుందని ధీమా
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా తాను ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై రఘురాజు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి జగన్ ఆయన పేరునో లేదా ఆయన తండ్రి పేరునో పెట్టుకుంటున్నారని విమర్శించారు. పీఎం కిసాన్ పథకానికి కూడా వైఎస్సార్ రైతు భరోసా అని పేరు పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో రాసి... పీఎం కిసాన్ పేరును కనిపించీ కనిపించనట్టు ముద్రిస్తున్నారని విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నట్టు తెలుసుకున్న కేంద్రం... రూ. 5,300 కోట్లను నిలిపివేసినట్టు తెలిసిందని రఘురాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఓవైపు ప్రధాని ఫొటో, మరోవైపు సీఎం ఫొటో వేసుకుంటే అభ్యంతరం లేదని... అలా కాకుండా ఏదో సొంత జేబులో నుంచి డబ్బు తీసి ఇస్తున్నట్టు ఆయన ఫొటో, ఆయన తండ్రి ఫొటో వేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.


Raghu Rama Krishna Raju
YSRCP
Telugudesam
Janasena

More Telugu News