గుజరాత్ లో ఒకే రోజు ఇద్దరు మాజీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదాలు

  • గుజరాత్‌కు సీఎంలుగా పనిచేసిన విజయ్ రూపానీ, సురేశ్ మెహతా
  • గుజరాత్‌లో వేర్వేరు చోట్ల ప్రమాదాలు 
  • ఓ ప్రమాదంలో బైకర్‌కు గాయాలు
ఒకే రోజు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు త్రుటిలో పెను ప్రమాదాల నుంచి బయటపడ్డారు. వారిలో ఒకరు విజయ్ రూపానీ కాగా, మరొకరు సురేశ్ మెహతా. వీరిద్దరూ గుజరాత్‌కు సీఎంలుగా పనిచేసిన వారే. విజయ్ రూపానీ  కాన్వాయ్ అహ్మదాబాద్-రాజ్‌కోట్ జాతీయ రహదారిపై ప్రయణిస్తుండగా సురేంద్రనగర్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభు అనే వ్యక్తి తన బైక్‌పై రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రూపానీ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొట్టింది. గాయపడిన బాధితుడు ప్రభును ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో రూపానీ మరో కారులో ఉన్నారు. కాగా, బాధితుడికి స్వల్ప గాయాలైనట్టు పోలీసులు తెలిపారు.

గుజరాత్‌లోనే జరిగిన మరో ప్రమాదం నుంచి మాజీ సీఎం సురేశ్ మెహతా కొద్దిలో తప్పించుకున్నారు. మోర్బీ జిల్లా హల్వద్ పట్టణ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఓ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. కారును చూసి ట్రక్కు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే, వేగం తగ్గడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం మెహతా మరో కారులో వెళ్లినట్టు పేర్కొన్నారు.


More Telugu News

Gujarat Vijay Rupani Suresh Mehta Road Accident